నేను ఒంటరిగా వున్నప్పుడు, మా ఇంటిముందున్న పచ్చని చెట్లను తదేకంగా చూస్తూవుండటం నాకు ఒక అలవాటు. ఎందుకో,ఏమోకాని, అవి నా స్నేహితుల్లాగా అనిపిస్తాయి. వాటి భాషా, నా భాషా ఒక్కటే అనిపిస్తుంది.
ఎప్పటిలాగే ఆ రోజుకూడా చెట్లని చూస్తూ వున్నాను. ఎందుకో ఏదో తేడా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది. అవి నీరసంగా, బలహీనంగా వున్నట్లు అనిపించింది. చలికాలంలో నల్లని కాకి కూడా తెల్లగా కనిపించినట్లుగా, ఆకుపచ్చని ఆకులతో మిలమిలా మెరిసే ఆకులన్ని తెల్లగా, బూడిద రంగుతో, జీవంలేనట్లుగా, కాలిపోయి, బూడిదయిన మానవ శరీరంలా కనిపిస్తున్నాయి. వాటివైపు తదేకంగా చూస్తుంటే, అవి నాతో తమ బాధను చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. అయినా వాటి నోరు పెగులుతున్నట్లులేదు. వాటి భావాలు నాకు అందటంలేదు. సరే, నేనే వాటిని మరొకసారి పరీక్షగా చూసాను. అప్పుడు అర్ధమయింది వాటి సమస్య ఏమిటో. అమితంగా పెరిగిపోయిన వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి విపరీతంగా పైకిలేచి, ఆ పచ్చని ఆకులను కప్పివేసాయి. తమ మిత్రుడు సూర్యుడు తోడొచ్చినా, పత్రహరితాన్ని తయారుచేసుకొనే స్థితిలో లేవు పాపం ఆ ఆకులు!!
నా మనసు గిలగిలలాడిపోయింది. నా నేస్తాలకి ఏదైనా సహాయం చేయాలి. వెంటనే చక్కని ఆలోచన వచ్చింది. మోటర్ ఆన్ చేసి, నీళ్ళగొట్టంతో ఆ మొక్కలపై నీళ్ళు పిచికారీచేసి వాటిని శుభ్రం చేద్దామనుకున్నా. అంతే, వెంటనే నా ఆలోచనను యుద్ధప్రాతిపదికనన అమలు పరచటానికి రంగంలోకి దిగాను. మోటర్ ఆన్ చేసాను; ఎంతో ఆశతో మొక్కల కొమ్మలు, రెమ్మలు నావైపుకు వాలాయి. చెప్పానుగదా మా భాష ఒకటేనని. ప్చ్! కరెంట్ లేదు.అప్పుడు గుర్తుకువచ్చింది “ సకల జనుల సమ్మె ” వలన విద్యుత్ ఉత్త్పత్తి లేక కరెంట్ రాదని! అవి, నేను ఎంతో నిరుత్సాహపడిపోయాం. ఇంతలో, మా మనోభావాలను, బాధను అర్ధంచేసుకున్నాయో ఏమో, కనిపించని మేఘాలు ఒక్కసారిగా పెద్ద వర్షాన్ని కురిపించాయి. మొక్కలపై వున్న దుమ్ము, ధూళి అంతాపోయి, పచ్చని ఆకులు కొత్త పెళ్ళికూతురులాగా మిలమిలలాడాయి. అంతా ఆనందం. ఆ క్షణం!!
ఉపసంహారం:– కాలుష్యం, సమ్మెలు మనుషులనే కాదు, నోరులేని మూగజీవాలను, పచ్చని చెట్లనుకూడా దెబ్బతీస్తాయి.

ఈ సమ్మె లతో ఎన్ని జీవుల జీవితాలు కూల్చేస్తున్నారో తెలియటల్లేదు. కొన్ని కొన్ని రిప్లేస్ చెయ్య లేము అందులో టైమ్ ఒకటి.
55 ఏండ్ల సంది మా తెలంగాణ ప్రజల బ్రతుకులు ఆగమ్ జేసి ,మా బిడ్డల నోటి కాడి కూడు లాక్కు తిన్న వాళ్ళ మనుసులు ప్రజాస్వామ్య బధ్ధంగా అహింసా యుతంగా చేస్తున్న పోరాటాలకు కరుగని సందర్భం లో మా 650 మంది బిడ్డలు మల మల మంటల్లో మాడి పోయినప్పుడు మిత్రమా ఆ ఆకు పాటి విలువైన మాకు లేకుండా పోయిందా? నీ జాలి గుండె ఆనాడే ఇమాత్రమయిన స్పందించి ఉంటే నీ తోటి మనుషులకు అన్యాయం జరుగుతుంటే మీ లాంటి దయార్ద హృదయులు అంతా స్పందిచ్చి కోల్పోతున్న వాళ్ళ పక్షాన కొంచం సాను భూతి చూపినా ఈ పరిస్తితి దాప్పూరించేది కాదు కదా? సమ్మె వల్ల నస్తలే అన్నీ అని చెప్పే పెద్ద మనుసున్న పెద్ద మంషులు సమ్మె పరిస్తితి రాకుండాచూడ వాల్సిన బాధ్యతగూడా ఉంటుంది.
నీతి నీతి మాటలు తీపి తీపి మాటలు మాట్లాడే నేర్పరితనమున్న వాళ్ళం కాదు మా తెలంగాణ వాళ్ళం.మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రపంచం లోనే అత్యధిక సంపన్నుడు అని పేరు బడ్డ నిజాం తోనే పోరుజేసిన చాకలి ఆయిలమ్మ,దొడ్డికొమురయ్య,వారసులమ్. పెంటయ్య వీరగొని.
నా వ్యాసంపై స్పందించిన నా తెలుగు సోదరులందరికీ నమస్కారములు.
మొదటగా, నేను ఒక ప్రకృతి ప్రేమికుడుని. కాలుష్య ప్రభావంవల్ల పచ్చని చెట్లు దుమ్ము, ధూళి, బూడిదతో ఎలా నశించిపోతున్నాయో చూసి, బాధపడుతుండగా, నిన్న (10-10-2011) మూడు గంటల ప్రాంతంలో పడిన వర్షంవల్ల, చెట్ల ఆకులన్నీ మళ్ళీ పచ్చగా కనిపించాయి. ఆ సంఘటనను చూసి, స్పందించి వ్రాసిన వ్యాసమే ఈ నా వ్యాసం. మరో కోణంలో వ్రాసింది కాదు. “ కాలుష్యం, సమ్మెలు మనుషులనే కాదు, నోరులేని మూగజీవాలను, పచ్చని చెట్లనుకూడా దెబ్బదీస్తాయి ” అని ముగింపులో చెప్పినదానినిబట్టి నా మనోభావాల్ని మీరందరూ అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ‘సకల జనుల సమ్మె’ అన్న టైటిల్ ని చూసి మీరు మరొక విధంగా ఊహించుకొని వుంటారని నేను తలుస్తాను.
సమ్మె గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనోభావాలను చెప్తాను. ప్రశాంతంగా ఆలోచించండి. “సమ్మె” ( in English it is called as
STRIKE) అంటే, ‘కొట్టివేయటం; త్రుంచివేయటం’ మొదలైన అర్ధాలు వస్తాయి. అయితే, సమ్మె వేరు; ఉద్యమం వేరు. “ ఉద్యమం ఒక సామాజిక మార్పు ” ని తెచ్చేది; తదనుగుణంగా చక్కటి వ్యవస్థ ఏర్పడి, సుపరిపాలన జరుగుతుంది. ఇందులో రాజకీయాలు వుండవు. ప్రజలందరి భాగస్వామ్యం మాత్రమే వుంటుంది. మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం; నేడు జరుగుతున్న యెమెన్; లైబీరియా ఉద్యమాలు ఈ కోవలోకే వస్తాయి.
1970 దశాబ్ది మొదట్లో జరిగిన జైఆంధ్ర; జై తెలంగాణా ఉద్యమాలను నేను చూసాను, అనుభవించాను. అవి రాజకీయ ఉద్యమాలే. అందుకే ఫలితాలు రాలేదు. సామాన్య ప్రజలు కష్ట,నష్టాలను అనుభవించారే కానీ, రాజకీయనాయకులకు చీమంతైనా నష్టం కలుగలేదు. అప్పుడూ రాజకీయనాయకుల ప్రోద్బలంతో ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు. ఇప్పుడూ అదే తంతు జరుగుతున్నది. అప్పుడు, ఇప్పుడు కూడా రాజకీయ నాయకుల చేతుల్లో సామాన్య జనం మోసపోతూనే వున్నారు, నష్టపోతూనే వున్నారు. కాబట్టి నేటి యువత దీనిని గమనించి, అర్ధంచేసుకోని, ఉద్యమించాలి.
నేడు ఈ సమ్మె చేయుస్తున్న సీనియర్ రాజకీయనాయుకుల ( ఏ పార్టీ వారైనా కానివ్వండి ) సరాసరి వయస్సు తీసుకుంటే 55 సంవత్సరాలు పైబడ్డవారే. అంటే, మనుమళ్ళు, మనుమరాళ్ళతో ఆడుకునే వయస్సే. M.L.A. M.P. లు గా వుండి, మంత్రులుగా కూడా పనిచేసిన వారే. ఎంతోమంది స్వంత ఆస్తులు సంపాదించుకున్నారేగానీ, ప్రాంతీయ బేధాలతో, పక్షపాత ధోరణితో నడిచిన ప్రభుత్వాలను మునుపెప్పుడు నిలదీయలేదే? ఇప్పుడు ఎట్లా, ఎందుకు గుర్తుకువచ్చింది?
ఒక చెట్టు బాగా పెరిగి, కాయలు కాస్తున్నది. ఇంకా ఎక్కువ కాయలు కాయాలంటే, ఆ చెట్టుకు ఎరువులు వేసి, సంరక్షణ చేస్తే ఫలాలు బాగా వస్తాయి. అంతే కానీ, క్రొత్త మొక్కను నాటటం ద్వారా ఆశించిన ఫలితం వెంటనే రాదు. మన రాష్ట్రం కూడా ఈ చెట్టు లాంటిదే. సమ్మె చేసి, ప్రత్యేక రాష్ట్రం కావాలని అనటం కంటే, “ జవాబుదారీతనం కలిగివుండే ఒక ప్రభుత్వం, చక్కటి రాజకీయ, ప్రజావ్యవస్థల సమ్మేళనంతో కూడిన ఒక
WATCH DOG లాంటి వ్యవస్థ ఏర్పాటుకు నాయకులు, మేధావులు ఉద్యమించాలి. అప్పుడే చక్కటి ఫలితాలు, ఆశించిన ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ సమంగా అందుతాయ్.
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంగ్లేయులు, ప్రజలకు నీళ్ళు, విద్యుత్తు, చదువులు, తిండి, బట్ట మొదలైన అనేక సౌకర్యాలను అందకుండా చేసి ఇబ్బందిపెట్టారు. ప్రస్తుత సమ్మెలో, ఈ పనిని మనకు మనమే చేసుకుంటున్నాం. మనిషి బలంతో చేయలేని పనిని యంత్రాలద్వారా చేయవచ్చు. ఈ రెండిటి ద్వారా చేయలేని దానిని మనిషి తన యుక్తితో చేసి, సాధించాలి. నిజంగా ‘సహాయ నిరాకరణ ఉద్యమం’ చేయాలనుకుంటే, (1) విద్యుత్ ఉత్పత్తిని ఆపొద్దు, పెంచాలి – కరెంట్ బిల్లులు కట్టొద్దు; (2) నీటిని అందించండి, ముఖ్యంగా రైతన్నలకు – నీటి బిల్లులను కట్టొద్దు; (3) బస్సులు, రైళ్ళను నడవనీయండి – టికెట్టు డబ్బులు ఇవ్వద్దు; (4) టెలీఫోన్లు పనిచేయనివ్వండి – డబ్బులు కట్టొద్దు; (5) దుకాణాలు తెరవనీయండి – ప్రభుత్వానికి ట్రేడ్ లైసెన్సు రుసుము కట్టొద్దు; (6) ప్రభుత్వ, ప్రభుత్వరంగ కార్యాలయాల్లో పనులు ఆపొద్దు – ఆ పనులు చేయటానికి ప్రభుత్వానికి చెల్లించే రుసుమును చెల్లించకండి; (7) అవసరమైన చోట, జపాను కార్మికుల పద్ధతిలో, అధిక ఉత్పత్తిని చేయనివ్వండి. ప్రభుత్వాలపై తప్పక ఒత్తిడి వస్తుంది. ఎవరూ ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి రాదుకూడా.
ఈ నా భావాలను బట్టి, నేను సీమవాడినా,(వాదినా); కోస్తాంధ్ర వాడినా (వాదినా) అని మీరు ఆలోచిస్తుండవచ్చు! నేను తెలుగు మాట్లాడే అసలు, సిసలు తెలంగాణావాడినే!! తెలుగు మాట్లాడేవారంతా తెలంగాణేవారే! అందరూ సుఖంగా వుండాలని కోరుకునేవాడినే!!
మీ స్నేహశీలి,
మాధవరావు.
Where were you when “integrationists” were doing agitations?
The aspirations of Telangana people can’t be denied by resorting to funny logic
We are fighting for independence for our state.
Dear Sri Rao garu,
This is an excellent snippet on contemporary events. The matter of fact presentation itself is a comment. It needs no further. Congrats.
Murty
baagundi,
anna keep it up
శ్రీ nandam గారికి, నమస్కారములు.
ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం.
మీ స్నేహశీలి,
మాధవరావు.