‘ఏడవకు కన్నా…ఏడవకు…’ అంటూ తల్లి బిడ్డను సముదాయిస్తుంది; జోలపాడుతుంది; నిద్రపుచ్చుతుంది. ఈ లోకమే తెలియకుండా బిడ్డ గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ప్రశాంతంగా నిదురపోతాడు. ఇది మనమందరమూ అనుభవించిందే; చూసేదే.
ఒకప్పుడు శాస్త్రాలు తెలిసినవారు కొద్దిమందే వుండేవారు. వారు విషయాల్ని కచ్చితంగా చెప్పేవారు. ఈనాడో! సంఖ్యాశాస్త్రం, జోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రం, రమలశాస్త్రం అంటూ అనేకమంది ఈ శాస్త్రాలను చెప్పేవారు వచ్చేసారు. వీటిని నమ్మేవాళ్ళూ ఎక్కువైపోయారు; నమ్మి మోసపోయేవారూ, నష్టపోయేవారూ ఎక్కువైపోయారు. డబ్బులు పోగొట్టుకొని, శనిని కొనితెచ్చుకున్నామని వాపోతున్నారు. వున్న ప్రశాంతతను, ఆనందాన్ని పోగొటుకుంటున్నారు. ఇది ఎదుటవున్నదాన్ని వదులుకొని, లేనిదానిని వెదకటంలాంటిది. దీనికి కారణం అయోమయం (అధ్యాసం), అజ్ఞానం (తెలియనితనం).
పైన చెప్పిన సంఖ్యాశాస్త్రం; జోతిష్యశాస్త్రం; వాస్తుశాస్త్రాలని పరిశీలిస్తే వీటన్నిటిలో ముఖ్యంగా కనిపించేది ‘సంఖ్యలు’. మనిషి జీవితంలో ఈ సంఖ్యలకు చాలా ప్రాముఖ్యం వుంది. ఇండో-అరబిక్ సంఖ్యాశాస్త్రంలో మన దేశంయొక్క పాత్రకూడా చాలానేవుంది.
మనిషికి, ఈ సంఖ్యలకు మధ్యవున్న సంబంధం, కొన్ని విచిత్రమైన సంబంధాలను చూస్తే ఔరా! అనిపిస్తుంది. సంఖ్యాశాస్రం ప్రకారం అయ్యా మీ పేరులో వున్న సంఖ్య, ఉదాహరణకి: ౩౩ ని స్కేప్ గోట్ (చచ్చిన మేక) అని అంటారు అనుకుందాము. అంటే, అతని జీవితంలో అన్నీ కష్టాలే, నష్టాలేనట!! కాబట్టి నీకు మనశ్శాంతి వుండదు, ఆనందం వుండదు. అందుకని నీ పేరులో కొన్ని ఆంగ్ల అక్షరాలని మార్పులుచేయాలి అని చెబుతారు. ఆ తరువాత డబ్బులు గుంజుతారు. జోతిష్యశాస్త్రాన్ని తీసుకుంటే, శని తొమ్మిదింట వుండాల్సింది మూడింట వున్నాడు; అందుకే నీకన్నీ కష్టాలే; తొమ్మిది లక్షల శని జపం చేస్తే అంతా మంచిది అవుతుంది అని నమ్మించి డబ్బు గుంజుతారు. ఈ విషయంలో వాస్తుకూడా ఏమీ తక్కువకాదు.
ఇక్కడ ఒక్క విషయం కొంత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదేమిటంటే సంఖ్య ‘ తొమ్మిది ’. దీని ప్రాముఖ్యం ఏమిటో తెలియదుకానీ, వేల సంవత్సరాలుగా ఈ సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఇవ్వటం జరిగింది. ఉదాహరణలకు:-
* భగవద్గీతలో అధ్యాయములు : పద్దెనిమిది
* భారత యుద్ధం జరిగిన రోజులు: పద్దెనిమిది
* భారతంలోని పర్వాలు: పద్దెనిమిది
* భారత యుద్ధంలోని సైనికి సంఖ్య: పద్దెనిమిది అక్షౌణులు
ఈ పద్దెనిమిది సంఖ్యను ఒకటి + ఎనిమిది గా కూడితే వచ్చే సంఖ్య:తొమ్మిది
ఇక మనం అనుసరించే సమయాన్ని తీసుకుంటే:
ఒక నిముషానికి అరవై సెకండ్లు చొప్పున, అరవై నిముషాలకు=3,600 సెకండ్లు = 3+6+0+0+=9 సంఖ్య వస్తుంది; ఇదే విధంగా, ఇరువదినాలుగు గంటలకు 86,400 సెకండ్లు; 365 రోజులకు 3,15,36,000 సెకండ్లు వస్తాయి. వీటన్నింటిలో వున్న సంఖ్యలను కూడితే, ‘తొమ్మిది’ సంఖ్యే వస్తుంది.
ఇక మన నాలుగు యుగాలను తీసుకుంటే : కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం: వీటి సంవత్సరాలు వరుసగా ఇలా వుంటాయి:
17,28,000 ; 12,96,000; 8,64,000; 4,32,000. వీటిలోని సంఖ్యలను కూడినా తొమ్మిది లేదా పద్దెనిమిది (కలిపితే తొమ్మిది) సంఖ్యనే వస్తుంది.
ఇక గ్రహాల్ని తీసుకుంటే, అవి తొమ్మిది; మన శరీరంలోని రంధ్రాలని తీసుకుంటే తొమ్మిది. ఇక్కడ ఒక చిన్న తమాషా విషయాన్ని చెప్పాలి. గోదావరి జిల్లాలో ‘ఏడు’ సంఖ్యను పలకరు. ఉదాహరణకు:- కొబ్బరికాయల్ని అమ్మేవాడు వాటిని లెక్కబెట్టేటప్పుడు, ఒకటి అని మొదలుపెట్టడు. లాభం అని మొదలుపెట్టి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడుకు బదులుగా, ఆరున్నొకటి, ఎనిమిది, తొమ్మిది అని లెక్కపెడతాడు.
పైన చెప్పినవన్నీ మనిషికి-అంకెలకు-వాటిద్వారా కలిగే లేదా కలుగుతుందనే అదృష్టానికీ-నమ్మకానికీ వున్న బంధం, సంబంధం. నిజానికి సంఖ్యలతోనే అదృష్టం, లాభం, ఆనందం వచ్చేటట్లైతే, ప్రతివక్కరూ ఆయా అదృష్ట సంఖ్యలనే వాడాలికదా! మరి అట్లా జరగటంలేదుకదా? భారతం – భారతయుద్ధం : దీనిని తీసుకుంటే అంతా తొమ్మిది సంఖ్యే! మరి కౌరవులు ఓడిపోయారు; పాండవులు గెలిచారు. అంటే, ఒక సంఖ్య ఒకరికి లాభిస్తే, మరొకరికి నష్టం కలిగించింది. ఒకరికి ఆనందం కలిగిస్తే, మరొకరికి మనస్తాపం కలిగించింది.
అయితే, ఆధ్యాత్మికశాస్రం ప్రకారం, ప్రతి మనిషికీ కచ్చితంగా లాభం, సుఖం, ప్రశాంతత, అనంతమైన ఆనందం కలిగించే ఒక సంఖ్య వుంది. ఈ సంఖ్యను అందరూ అనుసరిస్తే అంతా లాభమే. ఆ సంఖ్య ‘ఏడు’. శబ్దం; రూపం; వాసన; రుచి; స్పర్శ; మనస్సు; బుద్ధి – ఇవి మొత్తం ఏడు. ఇక్కడ ఒక శ్లోకాన్ని చూడండి:
ఓః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే ఓం శాంతిః శాంతిః శాంతిః
దీని అర్ధం:- ఆ అదృశ్య బ్రహ్మము పూర్ణము; ఈ దృశ్య బ్రహ్మము కూడా పూర్ణము. ఆ అదృశ్య పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య పూర్ణ బ్రహ్మమును తీసివేసిన మళ్ళీ పూర్ణ బ్రహ్మమే మిగిలియుండును.
పైన చెప్పిన ఏడు విషయాలు, శబ్ద, రూప, వాసన, రుచి, స్పర్శ, మనస్సు, బుద్ధి ఇవన్నీ బయట జగత్తుతో మమేకం అయివుంటాయి ఎప్పుడూ. అయితే, వీటన్నిటి జ్ఞానంకూడా బ్రహ్మమే – సంపూర్ణ బ్రహ్మమే. అయితే, బాహ్య ప్రపంచంతోనే ఇవి మమేకం అయివుండటం వలన, వీటిద్వారా వచ్చే లాభం, సుఖం, ఆనందం కొంతమాత్రమే; కొంతకాలం మాత్రమే వుంటాయి. అయితే, ఈ ఏడింటిద్వారా కలిగే జ్ఞానం మనకు అవసరంలేదా? అని అంటే, అవసరానికిమేర మాత్రమే ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి. అవసరానికి కొలత ఏమిటి? అని ప్రశ్నిస్తే, సమాధానం: మనకు కష్టం, నష్టం, అశాంతి కలగనంతమేర అని తప్పక చెప్పుకోవాల్సిందే. మరొకవైపు చూస్తే, మనలోని అంతరాత్మ సంపూర్ణ జ్ఞానం. దీనికి తరుగులేదు. పైనచెప్పిన ‘ఏడు’ విషయాలను మనలోని అంతరాత్మనుంచి తీసివేస్తే మిగిలేదికూడా సంపూర్ణ జ్ఞానమే! అయితే ఈ సంపూర్ణ జ్ఞానం మనకు నిత్యమైన, అనంతమైన సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి, ఇతర సంఖ్యలను నమ్ముకొని ఏడవద్దు, ఏడు సంఖ్యను నమ్ముకోండి; ఏడుని తీసివేయండి; ఏడుపుని తీసివేయండి; ఆత్మానందాన్ని పొందండి. స్వస్తి.