‘రాధామాధవ్ గద్యకవితలు’

“ మనుషులు చేసిన దేవుళ్ళు ”

దేవతలను సృజించి, రచించి, సృష్టించినారీమానవులు
నామకరణములు చేసి, సహస్రనామాంకితులను చేసినారు
రూపములను రచించి, కొందరికి నామములను దిద్ది గోవిందుడన్నారు
నాలుగుముఖములనుబెట్టి, బ్రహ్మయనియు;
మూడు కన్నులుబెట్టి ముక్కంటనియన్నారు
శంఖ,చక్ర,శూల,గదాధరులనుజేసి,
కిరీటములనుబెట్టి, పీతాంబరులనుజేసి
తాము సృష్టించిన దేవుళ్ళకే పూజలుజేసి, భజనలుజేసి, మురిపాలుజేసి
తాము మురిసారు, తమను తామే మరిచారీమానవులు;

పాతాళమునందు, కొండగుహలయందు,
కొండశిఖరాగ్రములయందు, నీటియందు, నేలయందు
అచటనిచటయను భేదములేక గుళ్ళు,గోపురములనుగట్టి
అన్నిటా దేవుడున్నాడన్న చందమున
మట్టితో, కట్టెతో, కఠినశిలలతో దేవీదేవతామూర్తులను నిలబెట్టి
తమ చాతుర్యమును చాటుకున్నారీమానవులు;

తాము సృజించిన దేవతామూర్తులకు మహత్తుపెరగాలని
మత్స్యకూర్మాది యంత్రములను స్థాపించి, తంత్రములనుజేసి,
మంత్రములను మంత్రముగ్ధములుగా పఠించి,
సాములజేత ప్రత్యేక పూజలుజేయించి
తమతమ కోరికలను తీర్చమని,
తీర్చలేని కోరికలనుసైతం తీర్చమని
అడుగడుగు దండాలుబెట్టి, హారతులిచ్చి,
తలనీలాలే నీలమళులుగా సమర్పించి,
కోరిందిస్తే కానుకలిస్తామని ఊరించారీమానవులు, కానీ,
మరిచారు అవి మనుషులుజేసిన బొమ్మలనీ,
మరిచారు తాము దేవుడుజేసిన బొమ్మలమనీ;

సోది చెప్పించుకున్నారు; తాళపత్రగ్రంధములను శోధించమన్నారు
చేతిగీతలు చదివించుకున్నారు, జాతకములు వ్రాయించుకున్నారు
తమ నుదిటి గీతల జాతకములు అనుకూలముగా మారతాయేమోనని
తాయత్తులు కట్టించుకున్నారు మహత్తులతో తమ విపత్తులు
నిష్పత్తులేలేకుండా దూదిపింజలై పోవాలనీ,
జీవితాన హరివిల్లులే విరియాలనీ కోరుకున్నారీమానవులు;

ఊరూరూ, దేశదేశాలూపట్టి తిరిగారు
కనిపించని సుఖాలకై, శాంతిసౌఖ్యాలకై,
అలసి, సొలసిపోయారీమానవులు
ఆనందాన్ని అందుకోలేక;

వేదములను మరిచారు, ఉపనిషత్తులను మరిచారు,
వాటిని భోదించే గురువులను మరిచారీమానవులు
ఆత్మారాముడు ఎక్కడోలేడనీ,
తమ అంతరంగమునందే వున్నాడనీ,
గుప్పెడంత హృదయాంతరంగమునందు
ఆనందస్వరూపుడై వున్నాడనీ
తామే దైవస్వరూపములనీ భోదించే
తత్త్వవిదానందుల తత్త్వసారమును త్రాగండీ జనులారా
తరించండీ ఓ జనులారా.

Published in: on ఫిబ్రవరి 2, 2020 at 12:15 ఉద.02  6 వ్యాఖ్యలు  

‘ రాధామాధవ్ గద్యకవితలు ‘

“ గురు సత్కారం ”

గౌతమముని తపమున
గోదావరీనది ఏడుపాయలై
గోదావరి జిల్లాలను తడిపి, సస్యశ్యామలములను చెయింగ
నృసింహశాస్త్రి పితామహ తపమున
సరస్వతీనది రెండుపాయలై
ఒకటి నృసింహశాస్త్రి రూపమునొంది
గోదావరి జిల్లాలను బ్రహ్మజ్ఞాన జలములతో స్పృసించి
మహామహోపాధ్యాయిగా ప్రసిద్ధిగాంచగ
మరొకటి,
దయ-ఆనంద-సరస్వతీమూర్తుల కృపతో
తత్త్వవిదానంద సరస్వతి రూపమునొంది
బ్రహ్మవిద్యాకుటీరమునుజేరి
ఎందరో బ్రహ్మవిద్యాదాహార్తులను జేరదీసి
ఓ, నామాహాలను దిద్దించి
మహాగ్రంధములను రచించి, చదివించి
సరస్వతీనామ సార్ధకతను నిలిపి
మహామహోపాధ్యాయ బిరుదును బడసి
మాకందరికీ మహామహోపకారమును చేయుచున్న స్వామీజీ
మీకివే మా ఆత్మనమస్కారములు.

Published in: on ఫిబ్రవరి 1, 2020 at 12:15 సా.02  14 వ్యాఖ్యలు  

“ శిలలే నయమనిపించును ”

నారద,తుంబుర వీణానాదములకు కఠిన శిలలుకూడా కరిగిపోయాయిట. ఆమరశిల్పి జక్కన్న చిత్రంలో ఒక పాటలో కవి, ‘ పైన కటిన మనిపించును, లోన వెన్న కనిపించును; జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును..’ అని వ్రాసారు. నిజమేకదా! అంత కఠినమనిపించే శిలలనే వెన్నను చెక్కినట్లు చెక్కి అద్భుత శిల్పాలను చెక్కారు; ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక విషయాలను మనకు బోధించారు మన పూర్వులు.

జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమమైనది. పశుపక్ష్యాదులకు ఒకటో, రెండో ముఖ్య గుణాలుంటాయి. వాటి జీవితాంతం అవి అవే గుణాలను పట్టుకొని జీవిస్తాయి; ఆ గుణాలతోనే అవి మనకు తెలియబడతాయి. కానీ, సహజంగా అనేక ఉన్నతమైన గుణాలున్న మనిషి, నివురుగప్పిన నిప్పులాగా, తన సహజ నైజాన్ని కఠిన పాషాణాల్లాంటి దుర్మార్గపు గుణాలచే కప్పబడి, మానవత్వాన్నే మరచి, శిలలుకూడా సిగ్గుపడేలాగా జీవిస్తున్నాడు.

సామ్రాజ్యవిస్తరణ కాంక్షతో, అప్పటి రాజులు, అధికార కాంక్షతో, ధనకాంక్షతో, పేరు,ప్రతిష్టల కాంక్షతో అనేక యుద్ధాలుచేసి, అనేకమంది సైనికుల, అమాయక ప్రజల ప్రాణాలనుతీసి, తమ,తమ బలహీనతలను, తమ,తమ బలీయమైన కోరికలుగా మార్చుకొని, ఇతర రాజులను ఓడించి, తమతమ గుత్తాధిపత్యాన్ని ప్రతిష్టింపచేసుకున్నారు. తమతమ ‘ విజయాలను చరిత్రలో నిలిచిపోయేటట్లుగా, భావితరాలవారికి గుర్తుండేటట్లుగా శిలాశాసనాలను చెక్కించారు. వీరి చేష్టలకు శిలలు నివ్వెరపోయాయి; తలలువంచి, కుంచించుకుపోయాయి. ఆ యా మహారాజులు గెలిచింది శారీరకంగా బలహీనులైన తోటి రాజులనా? గెలిచినా, వారు ఆ యా రాజుల, ఆ యా దేశాల ప్రజల మనస్సులను ఎప్పటికీ గెలవలేదే!! వారి మనసులను పాషాణ శిలలుగా మార్చివేసారే! మానసికంగా తమతమ బలహీనతలను గెలవలేని ఆ రాజులు అంతమంది సామంతరాజులను గెలిచినా ఒరిగింది ఏముంది? డబ్బు, పేరు తప్ప? వారిని గెలిచి, తామే గెలిచామనుకున్న ఆ రాజుల మనస్సులు కఠిన శిలలు అనబడే ఆ కొండరాళ్ళకంటే మించిన బండరాళ్ళుకావా? ’. ఇదంతా చరిత్ర అనుకున్నా, నేటి భారతమేంటి? అప్పటిలా అనేక యుద్ధాలు నేడు జరగకపోవచ్చు. కానీ, అంతకంటే ఎక్కువగా దేశదేశాల రాజకీయనాయకులు కుశ్చిత, కుటిల, స్వార్ధ రాజకీయాలతో ప్రజలను మోసగిస్తూనేవున్నారు; మానసిక క్షోభకు గురిచేస్తూనేవున్నారు.

అప్పట్లో కొంతమంది రాజులు ఇతర బలహీన రాజులను ఓడించి, సామంతులుగా చేసుకున్నా, ఆతరువాత ప్రజలను బాగానే చూసుకున్నారు. కానీ, నేటి రాజకీయనాయకులు మనుషుల ప్రాణాలకే ముప్పుతెస్తూ, మానవజాతి మనుగడకే ప్రశ్నార్ధకమవుతున్నారు. వీరి కుయుక్తులు సూక్ష్మదర్శినిలోకూడా కనిపించవు. తినే, త్రాగే ఆహారపదార్ధాలలో విషపూరిత రసాయనాలను కలిపి ప్రజలకు అందచేస్తున్నారు. బియ్యంలో ప్లాష్టిక్ బియ్యాన్ని కలుపుతున్నారు; కోడిగ్రుడ్లల్లో రసాయనాలను నింపుతున్నారు; మిరియాలలో బొప్పాసు గింజలను కలపటంవంటి అనేక దుర్మార్గాలను చేస్తున్నారు. చేసేది వ్యాపారులైనా, వారికి కొమ్ముకాసేది మూలసూత్రధారులైన రాజకీయనేతలే కదా?

ఇప్పుడు చెప్పండి శిలలు కఠినమైనవి అంటారా? లేక ఈ రాజులు, రాజకీయనాయకుల మనస్సులు శిలలకంటే కఠినమైనవంటారా? వీరి చేష్టలను అరికట్టాలంటే మనమంతా మేల్కొనాల్సిందే.

Published in: on ఆగస్ట్ 20, 2016 at 12:15 ఉద.08  6 వ్యాఖ్యలు  

“రాధామాధవ్ గద్యకవితలు ”

“ వేయిమాటలేల ”

చదువు నేర్చలేదని చింతనేల
నవమాసములు
అమ్మకోశమునందుండి
అమరకోశమును (దేవభాష) నేర్వలేదా

పెద్దలను గౌరవించ
సంస్కారము నేర్చలేదని తపించనేల
శిరస్సువంచి, రెంజేతులన్ ముడిచి
మ్రొక్కటము నేర్వలేదా అమ్మ పొట్టలో

కుళ్ళిపోయిన, కంపుకొట్టుచున్న
ఈ ప్రపంచమున
బ్రతుకుట కష్టమనుచు బేవురమననేల
తొమ్మిది మాసములు
మలమూత్రముల కూటస్థమందు మనలేదా

భవబంధములనే త్రాడుచే కట్టబడి, కట్టుబడిపోవాల్సిందేనా అని కుమిలిపోవనేల
‘మాయ’ త్రాడుచే కట్టబడి, కట్టుబడి
మాయా బంధమును త్రెంచుకొని
భూమ్మీదకు అడుగుపెట్టిన నీవు
భవబంధములను త్రెంచుకోలేవా

జీవితకాలమంతా
సంపాదించిన ఆస్థిపాస్తులను
బిడ్డ,పాపలకు పంచ సంశయము ఏల
ఏమి ఆశించకనే నీనుండి
అమ్మ, తన రక్తమును పంచలేదా

వేయిమాటలేల
సహస్ర సంశయములేల
బ్రహ్మజ్ఞానమును పొంద
బ్రహ్మసూత్రములు చదువరాదా
వేదాంత విద్య నేర్చ, వేదాంత పంచదశి నేర్వరాదా
మానసమునందు జ్యోతిని దర్శించ
బ్రహ్మవిద్యా కుటీరమును ఆశ్రయించరాదా.

Published in: on ఏప్రిల్ 26, 2016 at 12:15 ఉద.04  2 వ్యాఖ్యలు  

“ రాధామాధవ్ గద్యకవితలు ”

“ బ్రహ్మవిద్యా కుటీరం ”

పునాదులు వేయబడ్డాయి
నలువైపులా గోడలు కట్టబడ్డాయి
కిటికీలు, తలుపులూ పెట్టబడ్డాయి
పైకప్పు అమర్చబడింది
అందమైన కుటీరం రూపుదిద్దుకొంది;

పిలవని పేరంటానికిలా
ఆహూతులు (ఇక్కడ ఏళ్ళు అని అర్ధం)
వస్తున్నారు అందమైన కుటీరానికి
అంతలోనే అరవై రెండేళ్ళు దొర్లిపోయాయి
బయట, లోపల, అంతటా చూసినా
ఏదో తెలియని వెలితి, అశాంతి, చీకటి
కిటికీలు, తలుపులు అన్నీ తెరిచిపెట్టా
చల్లటి గాలులు, వెలుతురు ధారాళంగా లోపలికి వస్తున్నాయి
అయినా, అనుభవంలోకి రాని ఏదో విషయం..;

ఆలోచనచేసి
ఒక శుభముహూర్తాన
ఒక శుద్ధ బ్రాహ్మణుని కుటీరానికి ఆహ్వానించాను
వారు ‘జ్యోతి’ని వెలిగించి, మంగళాశాసనం చేసారు
జ్యోతి బ్రాహ్మణం మొదలయింది
తెలియని విషయమేదో తెలుస్తున్నది, అనుభవానికి వస్తున్నది;

వెలితిలో, వెలుతురు; అశాంతిలో, ప్రశాంతత; ఆనందం;
వచ్చినవి తెరిచిన కిటికీలు, తలుపులలోంచి కావు
అవి వచ్చినవి తెరవబడిన మనసులోంచే
తెలియని వెలితి, అశాంతి, చీకట్లకు కారణం తెలిసింది
నాటినుంచి ఆ ‘జ్యోతి’నీ వదిలిపెట్టలేదు
ఆ జ్యోతిని వెలిగించిన ‘బ్రాహ్మణునీ’ వదిలిపెట్టలేదు;

ఎందరో అడిగారు
కుటీరానికి పేరుపెట్టమని
‘బ్రహ్మవిద్యా కుటీరం’ అని పేరుపెట్టాను
ఆ కుటీరం ‘నేనే’
అందులో వున్నది ‘బ్రహ్మే’ !! అది నేనే !!
అహఃబ్రహ్మస్మి.

( మనిషి అందంగా లేకపోయినా, వున్నా, అతనిలో ఆనందం లేకపోతే జీవితానికి సార్ధకత వుండదు. మనిషిని ఒక ఆలయంతో, ఒక ఇంటితో పోలుస్తారు. వాటికీ వయసు వుంటుంది. ఇల్లు అందంగావున్నా, అందులోవుండే మనిషికి ఆనందం లేకపోతే అతని జీవితానికి సార్దకత వుండదు. నన్ను, నేను ఒక కుటీరంతో పోల్చుకుంటూ, ఈ కవితను వ్రాయటం జరిగింది. ‘జ్యోతి-బ్రాహ్మణం’ అనేది మనలోని జ్యోతి లేదా చైతన్యాన్ని గురించి ‘బృహదారణ్యకోపనిషత్’ లోని ఒక అధ్యాయం)

Published in: on ఏప్రిల్ 26, 2016 at 12:15 ఉద.04  Comments (1)  

రాధామాధవ్ గద్యకవితలు

“ జీవితమే రూపాయా ”

ఓ రూపాయి
కాళ్ళులేని, చక్రంలాంటి ఓ రూపాయి
బిరబిరా దొర్లుతూ
ముందుకు పరుగెత్తుతున్నదీ
పరువంలోని పడుచువాళ్ళలా
అలుపూ,సొలుపూ తెలియకుండా;

ఆ రూపాయికి
గమ్యమేదీ వున్నట్టులేదు
విశ్వమంటే నాకొక లెక్కా? అన్నట్లుగా
విసురుగా, విసురు రాయిలాగా
తిరిగుతూనే వున్నది;

ఇంతలో
ఆ రూపాయి వెనుకే
పరుగెత్తాయి ఓ రెండు కాళ్ళు
రూపాయి పరుగెడుతూనేవున్నది
ఆ రెండు కాళ్ళూ పరుగెడుతూనేవున్నాయి;

ఆ రూపాయికి గమ్యమేదీ లేదుకానీ
ఆ రెండు కాళ్ళకు ఒకటే గమ్యం
రూపాయిని అందుకోవాలనీ, అందంలం ఎక్కాలనీ
పరుగుపందెం నడుస్తూనేవున్నది
రూపాయి పరుగు ఆగలేదు, ఆపలేదు
ఆ రెండు కాళ్ళ మనిషి
రూపాయి సంపాదనలో ఎంతో సంపాదించాడు
కానీ, రూపాయికోసం పరుగు ఆపలేదు
పరుగుపోరాటంలో అలసి, సొలసి
ఆ రెండు కాళ్ళు కూలబడ్డాయి
రూపాయి ముందుకు పోతూనేవున్నది;

ఆ రెండు కాళ్ళ మనిషి
ఓసారి వెనక్కి తిరిగిచూసాడు
తన జీవితంలో తొంభైఅయుదు శాతం వెనక్కి వెళ్ళిపోయింది
అందనంత దూరానికి రూపాయి వెళ్ళీపోయింది
పదిశాతం దగ్గరలో మృత్యువు కనిపిస్తున్నది
వెనక్కి చూస్తే
తన కుటుంబం, బంధువులు, మిత్రువులందరూ
తనకు అందనంత దూరంలో వుండిపోయారు;

తనకీ, వెనకున్న తనవారికీ
తనకీ, ముందున్న రూపాయికీ
దూరం సుదూరంగా కనిపించింది
వెనకున్నవారూ అందరూ
ముందున్న రూపాయీ అందదూ
రూపాయి పరుగులో
ఆ రెండు కాళ్ళ మనిషి
తాను ఏం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు
రూపాయి బంధంకోసం
మానవ సంబంధాలనే జార్చుకున్నాడు
వారితో పొందే ‘ఆనందాన్ని’ చేజార్చుకున్నాడు
రూపాయి వులువకన్నా
తోటి మనషుల విలువే ఎక్కువని తెలుసుకున్నాడా ‘ మనీ’షి.

స్పూర్తి:- ( 27-3-2016 ఈనాడు ఆదివారం పత్రిక:- ‘యాపిల్’ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్, ఆసుపత్రిలో, తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటల ఆధారంగా వ్రాసిన కవిత )

Published in: on ఏప్రిల్ 13, 2016 at 12:15 సా.04  4 వ్యాఖ్యలు  

రాధామాధవ్ గద్యకవితలు

“ నా ఉగాది ”

ఉగాది
మొదలైంది చైత్రమాసంతో
దుర్ముఖి నామంతో
దుర్ముఖి నామరూపాలతో నాకేమి
వసంత ఋతుశోభలతో
చైత్రమాస చైతన్యం తొణికిసలాడుతుండగా;

ఉగాది మొదలైంది నాకు
ఆది దంపతులైన అమ్మా,నాన్నలతో
ఉగాది మొదలైంది ‘అమ్మా’ అనే నా ఆలాపనతో
ఉగాది మొదలైంది అమ్మ పాలతో
ఉగాది మొదలైంది మొదటి ఊపిరితో
ఉగాది మొదలైంది తొలి సూర్యకిరణాలతో
ఉగాది మొదలైంది గురుదేవులు నాతో దిద్దించిన ఓ, నా, మహాలతో
ఉగాది మొదలైంది నా మొదటి ఆలోచనతో
ఉగాది మొదలైంది అజ్ఞానమనే నిద్రనుంచి లేచిన ప్రతి ఉదయం
ఉగాది మొదలైంది తత్త్వవిదానందంతో, తత్త్వవిదానందంలో
ఉగాది మొదలైంది నాలో
జ్యోతి బ్రాహ్మణాన్ని అంకురార్పణ చేసిన పూజ్య స్వామీజీతో

పుత్రులులేరని కించిత్ బాధలేదునాకు
పున్నామి నరకాన్ని దాటేదెలా అని చింతేలేదు
ఆత్మ జ్ఞానాన్ని పొందితే
నన్ను నేను తెలుసుకుంటే
దేన్నీ దాటాల్సిన అవసరమేలేదు

ఉగాది అంటే ఒక యుగం ఆరంభమైందని అర్ధం
అంటే ఆ ఉగాదికి అంతంకూడా వున్నదనే కదా!
కానీ, నాయుగాదికి ఆ సమస్యేలేదు
ఆదిఅంత్యాలులేని చైతన్యమే నేను కనుక.

Published in: on ఏప్రిల్ 13, 2016 at 12:15 సా.04  8 వ్యాఖ్యలు  

“వేడి ధర్మం ”

వేడి ధర్మం ఏమిటి? అంటే చల్ల ధర్మంకూడా వుంటుందా? వుంటుందికానీ అది వేడి ధర్మంనుంచే వస్తుంది. ఇంతకీ ఏమిటీ వేడి ధర్మం? అదే మీతో చెప్పాలనుకున్నాను.

మన శరీర ధర్మం – ఎప్పుడూ 98.4 డిగ్రీల వేడి కలిగి వుంటుంది. మనం పీల్చి, విడిచిపెట్టే శ్వాసలో వేడి వుంటుంది. నీటిలో వేడివుంటుంది. అదే విద్యుఛక్తిగా మార్చబడుతుంది. పక్షులు గుడ్లను పొదగటంలో వేడివుంటుంది. అమ్మ పొట్టలో బిడ్డకు వేడివుంటుంది. అమ్మ ఒడిలో వేడివుంటుంది. సూర్యుడిలో వేడివుంటుంది. కవులు చెప్పినట్లుగా ప్రియురాలి కౌగిలిలో వేడివుంటుంది. భూమిపైన, లోపలా వేడివుంటుంది. సూర్యుడిలో, గ్రహాలలో, నక్షత్రాలలో వేడివుంటుంది. ఆకరికి చల్లనిగాలినిచ్చే ఏ.సీ. యంత్రంలోగానీ, ఫ్రిజ్‍లోగానీ వుండేది ఈ వేడే!!

వేడివలన ప్రతి పదార్ధంలోని అణువులు త్వరగా వ్యాకోచించి, అనేక మార్పులు చెంది, ఆ పదార్ధం మనకు ఉపయోగపడుతుంది. ఇంతకీ, ఈ వేడి ఎక్కడనుంచి వచ్చింది? వస్తున్నది? దీనికి మూలకారణం ఏమిటి?

ఈ విశ్వమంతా వేడితోనే నిండివుంది. కృష్ణబిలాలు (Black Holes) ఈ విశ్వంలో అనేకమున్నాయి. ఇవి ఒక ‘ గరాటు ’ లాంటి ఆకారంలో వుంటాయి అనేది ఒక ఊహ. ఈ గరాటు పైభాగంలో, మధ్యలో, అడుగునా అంతటా విపరీతమైన ఆకర్షణశక్తి పనిచేస్తూవుండి, దాని చుట్టూవున్న పదార్ధాలని తనలోకి లాగుకొని, వాటిని గరాటు క్రింది భాగంనుంచి బయటకు పంపివేస్తుంటుంది. లోపలికి వెళ్ళి, బయటకు వచ్చే ఆ పదార్ధాలు అనేక మార్పులు చెందుతాయి. ఆ సమయంలో అక్కడ, వాటిలో అత్యంత వేడి వుంటుంది. అటువంటి కృష్ణబిలాలనుండి పుట్టుకువచ్చినవే మన భూమి, గ్రహాలు, నక్షత్రాలు. As per the Big Bang Theory, The Universe
expanded from an extremely dense and HOT STATE and continues to
expand today. బిగ్ బ్యాంగ్ తరువాత భూమి ఏర్పడింది. అట్లా ఏర్పడిన మన భూమికూడా కొన్ని లక్షల సంవత్సరాలు అత్యంత వేడిగావుండి, ఆ తరువాత అంతులేని వర్షాలతో చల్లబడింది. అయినప్పటికీ, ఇప్పటికీ భూమిలోపల “ వేడి ” అలానే కొనసాగుతూనే వున్నది.

ఇది విశ్వంలోని, విశ్వంయొక్క రహస్యం కాబోలు. కంటికి కనిపించనిది విశ్వచైతన్య `శక్తి’; ఆ శక్తియొక్క బాహ్యరూపమే `వేడి’; ఆ వేడియొక్క బాహ్యరూపమే `వెలుగు’. ఏది ఏమయినా, ఈ ‘వేడి’ లోని ‘వెచ్చదనం’ లేకపోతే బహుశా ప్రాణుల ఉనికి వుండదేమోమరి!! యువరక్తంలోవుండే ఈ వేడే లేకపోతే, మానవజాతికూడా వుండదు.

Published in: on నవంబర్ 4, 2015 at 12:15 ఉద.11  7 వ్యాఖ్యలు  

“ నా రచనకు ప్రధమ బహుమతి ఇవ్వరూ? ”

‘దీపావళి’ పండుగ వచ్చేస్తున్నది. ప్రముఖ వారపత్రికలన్నీ రచయుతలందరీనుండి చక్కటి కథలను పోటీకి ఆహ్వానించాయి. ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలను ప్రకటించాయి. అనేకమంది రచయుతలు తమతమ రచనలను పత్రికాకార్యాలయాలకు పంపుతున్నారు. చివరకు ఆఖరి గడువు తేదీ వచ్చేసింది. కొంతమంది నేరుగా తెచ్చిఇస్తున్నారు. మరొక పదినిముషాలలో గడువు సమయం అయిపోతుందనగా ఒక ప్రముఖ పత్రికాలయానికి ఒక పండు ముదుసలి వచ్చి, నేరుగా సంపాదకీయుడుని కలిసి, తన రచనను ఆయన చేతికిచ్చి, తన రచనకు ప్రథమ బహుమతిని ఇవ్వాల్సిందిగా కోరాడు. అప్పుడా సంపాదకీయుడు అదెలా కుదురుతుంది? మా న్యాయనిర్ణేతల బృందం కథలన్నిటినీ చదివి, వాటిలో అత్యుత్తమంగా వున్న కథకు ప్రథమ బహుమతిని ప్రకటిస్తారు. అంతేకానీ మీరేంటి మీ రచనకే ప్రథమ బహుమతిని ఇవ్వమని సరాసరి అడుగుతున్నారు అని అన్నాడు. దానికి ఆ ముదుసలి మీరు నా రచనను చదవండి, తప్పక నా రచనకే మొదటి బహుమతి ఇస్తారు అనేసి వెళ్ళిపోయాడు.

న్యాయనిర్ణేతల బృందం వచ్చిన కథలన్నిటినీ చదివారు. వేటికీ మొదటి బహుమతి అర్హతలేదనే నిర్ణయానికి దాదాపుగా వచ్చారు. చివరగా మిగిలింది ఆ ముదుసలి ఇచ్చివెళ్ళిన రచన. దానిని అందరూ శ్రద్ధగా చదివారు. మరో ఆలోచనలేకుండా ఆ రచనకే ప్రథమ బహుమతిని ప్రకటించారు. సంపాదకుడుకూడా ఆశ్చర్యపోయి, తన ఆమోదాన్ని తెలిపాడు. ఇంతకీ ఆ రచనలో అంత గొప్ప విషయం ఏముంది? వినండి మరి …

భూమిపైన అక్కడక్కడా ఎత్తైన కొండలు. కొన్ని ఆకాశాన్ని అంటుతూవున్నాయి. వాటిపై పచ్చటి ఎత్తైన చెట్లు; ఔషధమొక్కలు. దూరంనుంచి చూస్తే నీలికొండల్లా కనిపిస్తాయి అందంగా. నీటితో నిండిన నల్లటి మబ్బులు ఆ కొండలపైకి రాగానే, చెట్ల చల్లటిగాలి తగలగానే, తమ బరువును దింపుకుందామనుకున్నట్లుగా, అవి ఆ కొండలపైనే వర్షాన్ని కురిపించి చక్కా వెళ్ళిపోతుంటాయి. ఆకాశమంత ఎత్తునుంచి ధారగా వర్షం భూమిపై పడితే నేల నిలుస్తుందా? అందుకే, ఎంతో ఎత్తైన కొండలపైన పడి, వర్షపునీరు చిన్నా,పెద్దా రాళ్ళపైనుంచి దుముకుతూ, ఔషధ రుచులను తమలో జీర్ణించుకొని, ధారలై, జలపాతాలై, నేలనుతాకి, నదులైపారి, భూమిని సస్యశ్యామలంచేసి, చివరకు సముద్రంలో కలిసిపోతుంది. జీవమనుగడకు ఏమాత్రం కష్టం,నష్టం కలుగకుండా. “ ఈ రచనా చాతుర్యం నాది కాదంటారా? ”

భూమిమీద ఎక్కడ చూసినా చెట్లు, మొక్కలే. అందమైన, కడు రమ్యమైన రంగులతోకూడిన పూలమొక్కలు, చెట్లు. ప్రకృతిశోభకు అద్దం. అంతేనా? పశుపక్ష్యాదులకూ, మనుషులకూ అవి ఆహారాన్ని అందిస్తాయి. అంతేనా? మనం వదిలిన చెడుగాలిని పీల్చుకొని, చక్కటి ప్రాణవాయువుల్ని మనకు అందిస్తాయి ఉచితంగా! పర్యావరణ సమతుల్యాన్ని నిలబెడతాయి. ఈ చెట్లుండే అడవులే లేకపోతే మనుషులకు నిలువ నీడ వుండేదా? పయనించి మనకు చేరే చల్లటి గాలి ఈ చెట్లవల్లేకదా మనకు చేరేది? “ ఈ రచనా చాతుర్యం నాది కాదంటారా? ”

రంగురంగుల పక్షులు; వింతవింత జంతువులు ఈ భూమ్మీద ఎన్నో కనిపిస్తాయి. మనుషులు వీటితో సహజీవనం చేస్తుంటారు. ఒక్క క్షణం ఆలోచించి చూడండి. అసలు మనిషి తాను ఎంతో తెలివైనవాడినని విర్రవీగుతుంటాడుగానీ, నిజంగా ఆకాశంలో ఎగరటం; నీటిలో ఈదటం; చెట్లు,కొండలు ఎక్కటం మొదలైనవన్నింటినీ ఈ పశుపక్ష్యాదులను చూసే కదండీ బాబూ నేర్చుకుంది? పైగా వాటినుంచి పాలు తీస్తాడు; చంపి మాంసాన్ని ఆహారంగా తింటాడు. ఇవన్నీ మనిషి జీవనానికి సహాయం చేస్తున్నాయికదా? “ ఈ రచనా చాతుర్యం నాది కాదంటారా? ”

*ఆకాశం లేందే మనిషి ఆకాశ హర్మ్యాలను కట్టేవాడా? చంద్రమండలంపైకి పయనించేవాడా? సూర్య,చంద్రులుండేవారా? చీకటి,వెలుగులుండేవా? ఋతువులుండేవా? *గాలి లేకపోతే ఏ జీవికైనా ప్రాణవాయువు అందేదా? మనిషి బ్రతికి బట్టకట్టేవాడా? *అగ్నేలేకపోతే ఈ జీవుల శరీరాలు మనగలిగేవా? *నీరు లేకపోతే జీవుల పుట్టుకే వుండేదా? *భూమి లేకపోతే ఈ వింతలన్నీ కనిపించేవా? “ ఈ రచనా చాతుర్యం నాది కాదంటారా? ”

అన్ని జన్మలలోకెల్లా మనిషి జన్మ ఉత్తమోత్తమమైనదని అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. ప్రకృతిని రక్షించి, గౌరవిస్తే మనకు మనం గౌరవించుకున్నట్లే. అందుకు మనిషికి కావాల్సింది మంచి మనస్సు, బుద్ధి. ఆ రెండిటినీ మనిషికిచ్చింది నేనుకాదా? “ ఈ రచనా చాతుర్యం నాది కాదంటారా? ”.

న్యాయనిర్ణేతలారా! ఇప్పుడు చెప్పండి ఇలాంటి ఘనమైన నా రచనకు ప్రథమ బహుమతి అర్హత వుందంటారా? లేదంటారా?

ధృవీకరణం:- ఈ రచన అంతా నాదేనని ధృవీకరిస్తున్నాను – ఇట్లు:- సర్వేశ్వరుడు.

/// రచన అంటే సృష్టి (CREATION) అని అర్ధం ///

Published in: on జూలై 5, 2015 at 12:15 ఉద.07  11 వ్యాఖ్యలు  

“ ఏడ (డు) వద్దు ”

‘ఏడవకు కన్నా…ఏడవకు…’ అంటూ తల్లి బిడ్డను సముదాయిస్తుంది; జోలపాడుతుంది; నిద్రపుచ్చుతుంది. ఈ లోకమే తెలియకుండా బిడ్డ గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ప్రశాంతంగా నిదురపోతాడు. ఇది మనమందరమూ అనుభవించిందే; చూసేదే.

ఒకప్పుడు శాస్త్రాలు తెలిసినవారు కొద్దిమందే వుండేవారు. వారు విషయాల్ని కచ్చితంగా చెప్పేవారు. ఈనాడో! సంఖ్యాశాస్త్రం, జోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రం, రమలశాస్త్రం అంటూ అనేకమంది ఈ శాస్త్రాలను చెప్పేవారు వచ్చేసారు. వీటిని నమ్మేవాళ్ళూ ఎక్కువైపోయారు; నమ్మి మోసపోయేవారూ, నష్టపోయేవారూ ఎక్కువైపోయారు. డబ్బులు పోగొట్టుకొని, శనిని కొనితెచ్చుకున్నామని వాపోతున్నారు. వున్న ప్రశాంతతను, ఆనందాన్ని పోగొటుకుంటున్నారు. ఇది ఎదుటవున్నదాన్ని వదులుకొని, లేనిదానిని వెదకటంలాంటిది. దీనికి కారణం అయోమయం (అధ్యాసం), అజ్ఞానం (తెలియనితనం).

పైన చెప్పిన సంఖ్యాశాస్త్రం; జోతిష్యశాస్త్రం; వాస్తుశాస్త్రాలని పరిశీలిస్తే వీటన్నిటిలో ముఖ్యంగా కనిపించేది ‘సంఖ్యలు’. మనిషి జీవితంలో ఈ సంఖ్యలకు చాలా ప్రాముఖ్యం వుంది. ఇండో-అరబిక్ సంఖ్యాశాస్త్రంలో మన దేశంయొక్క పాత్రకూడా చాలానేవుంది.

మనిషికి, ఈ సంఖ్యలకు మధ్యవున్న సంబంధం, కొన్ని విచిత్రమైన సంబంధాలను చూస్తే ఔరా! అనిపిస్తుంది. సంఖ్యాశాస్రం ప్రకారం అయ్యా మీ పేరులో వున్న సంఖ్య, ఉదాహరణకి: ౩౩ ని స్కేప్ గోట్ (చచ్చిన మేక) అని అంటారు అనుకుందాము. అంటే, అతని జీవితంలో అన్నీ కష్టాలే, నష్టాలేనట!! కాబట్టి నీకు మనశ్శాంతి వుండదు, ఆనందం వుండదు. అందుకని నీ పేరులో కొన్ని ఆంగ్ల అక్షరాలని మార్పులుచేయాలి అని చెబుతారు. ఆ తరువాత డబ్బులు గుంజుతారు. జోతిష్యశాస్త్రాన్ని తీసుకుంటే, శని తొమ్మిదింట వుండాల్సింది మూడింట వున్నాడు; అందుకే నీకన్నీ కష్టాలే; తొమ్మిది లక్షల శని జపం చేస్తే అంతా మంచిది అవుతుంది అని నమ్మించి డబ్బు గుంజుతారు. ఈ విషయంలో వాస్తుకూడా ఏమీ తక్కువకాదు.

ఇక్కడ ఒక్క విషయం కొంత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదేమిటంటే సంఖ్య ‘ తొమ్మిది ’. దీని ప్రాముఖ్యం ఏమిటో తెలియదుకానీ, వేల సంవత్సరాలుగా ఈ సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఇవ్వటం జరిగింది. ఉదాహరణలకు:-

* భగవద్గీతలో అధ్యాయములు : పద్దెనిమిది
* భారత యుద్ధం జరిగిన రోజులు: పద్దెనిమిది
* భారతంలోని పర్వాలు: పద్దెనిమిది
* భారత యుద్ధంలోని సైనికి సంఖ్య: పద్దెనిమిది అక్షౌణులు

ఈ పద్దెనిమిది సంఖ్యను ఒకటి + ఎనిమిది గా కూడితే వచ్చే సంఖ్య:తొమ్మిది

ఇక మనం అనుసరించే సమయాన్ని తీసుకుంటే:

ఒక నిముషానికి అరవై సెకండ్లు చొప్పున, అరవై నిముషాలకు=3,600 సెకండ్లు = 3+6+0+0+=9 సంఖ్య వస్తుంది; ఇదే విధంగా, ఇరువదినాలుగు గంటలకు 86,400 సెకండ్లు; 365 రోజులకు 3,15,36,000 సెకండ్లు వస్తాయి. వీటన్నింటిలో వున్న సంఖ్యలను కూడితే, ‘తొమ్మిది’ సంఖ్యే వస్తుంది.

ఇక మన నాలుగు యుగాలను తీసుకుంటే : కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం: వీటి సంవత్సరాలు వరుసగా ఇలా వుంటాయి:
17,28,000 ; 12,96,000; 8,64,000; 4,32,000. వీటిలోని సంఖ్యలను కూడినా తొమ్మిది లేదా పద్దెనిమిది (కలిపితే తొమ్మిది) సంఖ్యనే వస్తుంది.

ఇక గ్రహాల్ని తీసుకుంటే, అవి తొమ్మిది; మన శరీరంలోని రంధ్రాలని తీసుకుంటే తొమ్మిది. ఇక్కడ ఒక చిన్న తమాషా విషయాన్ని చెప్పాలి. గోదావరి జిల్లాలో ‘ఏడు’ సంఖ్యను పలకరు. ఉదాహరణకు:- కొబ్బరికాయల్ని అమ్మేవాడు వాటిని లెక్కబెట్టేటప్పుడు, ఒకటి అని మొదలుపెట్టడు. లాభం అని మొదలుపెట్టి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడుకు బదులుగా, ఆరున్నొకటి, ఎనిమిది, తొమ్మిది అని లెక్కపెడతాడు.

పైన చెప్పినవన్నీ మనిషికి-అంకెలకు-వాటిద్వారా కలిగే లేదా కలుగుతుందనే అదృష్టానికీ-నమ్మకానికీ వున్న బంధం, సంబంధం. నిజానికి సంఖ్యలతోనే అదృష్టం, లాభం, ఆనందం వచ్చేటట్లైతే, ప్రతివక్కరూ ఆయా అదృష్ట సంఖ్యలనే వాడాలికదా! మరి అట్లా జరగటంలేదుకదా? భారతం – భారతయుద్ధం : దీనిని తీసుకుంటే అంతా తొమ్మిది సంఖ్యే! మరి కౌరవులు ఓడిపోయారు; పాండవులు గెలిచారు. అంటే, ఒక సంఖ్య ఒకరికి లాభిస్తే, మరొకరికి నష్టం కలిగించింది. ఒకరికి ఆనందం కలిగిస్తే, మరొకరికి మనస్తాపం కలిగించింది.

అయితే, ఆధ్యాత్మికశాస్రం ప్రకారం, ప్రతి మనిషికీ కచ్చితంగా లాభం, సుఖం, ప్రశాంతత, అనంతమైన ఆనందం కలిగించే ఒక సంఖ్య వుంది. ఈ సంఖ్యను అందరూ అనుసరిస్తే అంతా లాభమే. ఆ సంఖ్య ‘ఏడు’. శబ్దం; రూపం; వాసన; రుచి; స్పర్శ; మనస్సు; బుద్ధి – ఇవి మొత్తం ఏడు. ఇక్కడ ఒక శ్లోకాన్ని చూడండి:

ఓః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే ఓం శాంతిః శాంతిః శాంతిః

దీని అర్ధం:- ఆ అదృశ్య బ్రహ్మము పూర్ణము; ఈ దృశ్య బ్రహ్మము కూడా పూర్ణము. ఆ అదృశ్య పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య పూర్ణ బ్రహ్మమును తీసివేసిన మళ్ళీ పూర్ణ బ్రహ్మమే మిగిలియుండును.

పైన చెప్పిన ఏడు విషయాలు, శబ్ద, రూప, వాసన, రుచి, స్పర్శ, మనస్సు, బుద్ధి ఇవన్నీ బయట జగత్తుతో మమేకం అయివుంటాయి ఎప్పుడూ. అయితే, వీటన్నిటి జ్ఞానంకూడా బ్రహ్మమే – సంపూర్ణ బ్రహ్మమే. అయితే, బాహ్య ప్రపంచంతోనే ఇవి మమేకం అయివుండటం వలన, వీటిద్వారా వచ్చే లాభం, సుఖం, ఆనందం కొంతమాత్రమే; కొంతకాలం మాత్రమే వుంటాయి. అయితే, ఈ ఏడింటిద్వారా కలిగే జ్ఞానం మనకు అవసరంలేదా? అని అంటే, అవసరానికిమేర మాత్రమే ఆ జ్ఞానాన్ని వాడుకోవాలి. అవసరానికి కొలత ఏమిటి? అని ప్రశ్నిస్తే, సమాధానం: మనకు కష్టం, నష్టం, అశాంతి కలగనంతమేర అని తప్పక చెప్పుకోవాల్సిందే. మరొకవైపు చూస్తే, మనలోని అంతరాత్మ సంపూర్ణ జ్ఞానం. దీనికి తరుగులేదు. పైనచెప్పిన ‘ఏడు’ విషయాలను మనలోని అంతరాత్మనుంచి తీసివేస్తే మిగిలేదికూడా సంపూర్ణ జ్ఞానమే! అయితే ఈ సంపూర్ణ జ్ఞానం మనకు నిత్యమైన, అనంతమైన సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి, ఇతర సంఖ్యలను నమ్ముకొని ఏడవద్దు, ఏడు సంఖ్యను నమ్ముకోండి; ఏడుని తీసివేయండి; ఏడుపుని తీసివేయండి; ఆత్మానందాన్ని పొందండి. స్వస్తి.

Published in: on జూన్ 17, 2015 at 12:15 ఉద.06  4 వ్యాఖ్యలు